Friday, 20 April 2018

మా సంపూర్ణ కాశీ యాత్ర




"సంపూర్ణ కాశీ యాత్ర" అనే పుణ్య కార్యం త్రేతాయుగం నుండి ప్రారంభమై నేటివరకు సాగుతున్న భక్తుల అద్భుత అనుభవాల సంపద. అది భారతదేశంలో లభించటం మన పూర్వ జన్మ సుకృతం. యాత్ర రీతి విధానాలపై పరిపూర్ణ అవగాహన కల్పించటమే వ్యాసము యొక్క ముఖ్యోద్దేశ్యం. సంపూర్ణ యాత్రలో దర్శించిన మహిమాత్మకమైన, మహోన్నతమైన వివిధ దేవీ, దేవతామూర్తుల మహిమలను వారి ఆవిర్భావ విశేషాలను విపులంగా వివరించటమే ఒక అత్యంత అధ్భుతమైన అనుభవం. సృష్టిలో అతి పురాతన నగరం కాశీ. ప్రళయకాలంలో ప్రకృతి అంతా జలమయమైనప్పుడు సృష్టి కార్యార్ధం పరమశివుడు కాశీ నగరాన్ని తన త్రిశూలంపై నిలబెట్టడం, పంచకోశ పరిణామం గల నగరము నుంచి సృష్టి మొదలు కావటమే అత్యంత విశేషం.

1.            ప్రళయ కాలంలో కూడా పార్వతీ పరమేశ్వరులు కాశీ నగరం వీడరు అన్నది జగద్విదితం.  కనుక నగరం "అముక్తం" అనే పేరుతో విరాజిల్లుతోంది.
2.          ఈక్షేత్రం మోక్షస్వరూపమగు ఆనందమునకు హేతువు అగుటవలన మహాదేవుడు "ఆనందకావనము" అన్న నామము సార్ధకము చేయటము జరిగినది.
3.           మణికర్ణికాతీర్ధము వాక్కులకు అగోచరంబగు పరంజ్యోతి ప్రకాశంతో నిండియున్నందున కాశీ అన్న పేరుతో వ్యవహరింపబడుతోంది.
4.            వరుణ, అసీ అనే రెండు నదులు కాశీ నగరానికి ఇరు వైపులా ప్రవహించటంవలన "వారణాశి" అనే పేరుతో వెలసింది.
5.            కాశియందు మరణించిన వారు వారి పాపములనుండి విముక్తులగుదురు కావున "ముక్తి భూమి" అయినది.
6.            శివుని ఆజ్ఞతో నిబద్ధమైనది కావున "శివపురి" అనే పేరుతో విలసిల్లినది.
7.            రుద్రుడు వశించు భూమి కావున "రుద్రభూమి" అను నామము సార్ధకము చేసుకొన్నది.

ఇన్ని నామములు కలిగిన కాశీ క్షేత్రం వీక్షించడానికి పవిత్ర గంగానదిలో పునీతులు కావడానికి దేవీ దేవతామూర్తులను సందర్శించు కొనడానికి ఎన్నో జన్మల పుణ్యసంపదే కారణం అనుకోవాలి. కాశీయందలి లింగములు, తీర్ధములు లెక్కించనలవి కానివి. గంగాజలమందు ఆరు కోట్ల సిద్ధలింగములు కలవు. వాటిలో కొన్ని మాత్రమే దర్శనయోగం కలిగి ఉన్నాయి. మరికొన్ని శిధిలావస్థలో ఉన్నవి. కాశీలోని శివలింగ ప్రతిష్టాపనలు చేసిన వైనం కృతయుగ ఆరంభం నుంచి నేటివరకు జరుగుతోంది. కొన్ని పూజకు యోగ్యమైతే మరికొన్ని శిలారూపంలో దర్శనం ఇస్తాయి. వేటికి మ్రొక్కినా లభించే ఫలం పుణ్యం మాత్రం అలవికానిది.

వ్యాసంలో సంపూర్ణ కాశీ యాత్ర రీతి విధానంపై పరిపూర్ణ అవగాహన తెలుపడమేకాక అచట వెలసిన వివిధ దేవీ దేవతా మూర్తుల విశేషాలను కొంత విపులీకరించడమైనది.

దక్షిణాన రామేశ్వరంలో మొదలైన సంపూర్ణ యాత్ర ముందుగా అగ్ని తీర్థంలో స్నానంతో మొదలు అవుతుంది. ఇచ్చట విశేషం శ్రీరాముడు సముద్రాన్ని తన ఉధృతాన్ని తగ్గించుకొని శాంతరూపం పొందమని వారధి నిర్మాణ సమయంలో వేడుకొనగా నాటినుంచి నేటివరకు శాంతరూపంతో చిన్నిచిన్ని అలలతో అలరించుటయే అద్భుతం. తీరాన అగ్నిహోత్రంతో పితృదేవతలకు పిండప్రధానాలు చేసి ఆరాధించే ప్రదేశం కావున అగ్నితీర్ధంగా వాసికెక్కినది.

23 తీర్దాలలో స్నాన ఫలితాలు:-
1.            మహాలక్ష్మి తీర్థం:- పాండవాగ్రజుడు ధర్మరాజు అత్యంత ఐశ్వర్యవంతుడై కీర్తి ప్రతిష్ఠలు పొందెను.
2.            సావిత్రి తీర్థం:- కశ్యప మహర్షి శాప విముక్తి పొందెను.
3.            గాయత్రీ తీర్థం:- కాశిబరి రాజు శాప విముక్తిడైన వైనం చరిత్ర చెబుతోంది.
4.            సరస్వతీ తీర్థం:-విద్యా బుద్ధులు నేర్చి పేరు ప్రతిష్ఠలతో విరాజిల్లుతారు.
5.            సేతు మాధవ తీర్థం:- మహాలక్ష్మి ఆశీర్వాదంతో వారి మనసులోని చెడు ఆలోచనలు పోతాయి.
6.            గంధమాధన తీర్థం:- సర్వ భాధల నుండి విముక్తులవుతారు.
7.            కవచ తీర్థం:- యమలోక నరక బాధలు కలగవు. వారిని కవచంలా తీర్థం కాపాడుతుంది.
8.            గవయా తీర్థం:- కల్ప వృక్షం సదా తన నీడలో కాపాడుతుంది. వారికి సర్వసుఖాలు, సంపదలు కలుగుతాయి.
9.            నలతీర్ధం:- సదా సూర్యదేవుడు ఆయురారోగ్యాలను ఇచ్చి కాపాడటమే ఒక విశేషం.
10.          నీల తీర్థం:- సర్వ యజ్ఞాలు చేసిన ఫలితం పొందటమే ఒక అధ్భుతం.
11.          సంకు తీర్థం:- తీర్థ స్నానం పాప రహితులని చేస్తుంది. వత్సభ రాజు స్నానమాచరించి సర్వ
               పాప  విముక్తి కావటం 
 చరిత్ర లోని ఒక వింతే.
12.          చక్ర తీర్ధం:- సాక్షాత్ సూర్య భగవానుడు తన చేతిని బంగారమయం చేసు కొనడం ఒక అద్బుతం.
13.          బ్రహ్మహత్యా విమోచనా తీర్థం:- బ్రహ్మహత్యా పాతకము నుంచి విముక్తులు అవుతారు. అంతేకాక
              త్రాగుడు, మదిర, మధువులతో చేసిన పాపాలు పోతాయి.
14.          సూర్య తీర్ధం:- విశేష జ్ఞానాన్ని గతంలో, వర్తమానంలో మరియు భవిష్యత్తులో పొందుతారు.
15.          చంద్ర తీర్ధం:- జ్ఞాన సముపార్జనకి తోడ్పడుతుంది.
16.          గంగ తీర్ధం:- గననసురూతి అనే రాజు అనంత విజ్ఞానాన్ని సంపాదించెను.
17.          యమున తీర్ధం:- అంతులేని తెలివితేటలు లభ్యమౌతాయి.
18.          గయ తీర్ధం:- పితృదేవతల ఆశీర్వాదాలు లభ్యమవుతాయి.
19.          శివ తీర్ధం:- బ్రహ్మ హత్యాపాతక విముక్తులవుతారు.
20.          సంధ్య మార్ధ తీర్ధం:- తెలిసీ తెలియక ఎవరినైనా శపించితే శాపకర్మనుంచి విముక్తులవుతారు.
21.         సర్వ తీర్ధం:- అనేక రోగాలనుంచి మరియు ముసలితనం బారినుండి విముక్తులై అత్యంత ఐశ్వర్యవంతులు  
              మరియు ఆరోగ్యవంతులు అవుతారు.
22.          కోడి తీర్ధం:- సాక్షాత్ శ్రీకృష్ణుడు తన మేనమామ కంసుని చంపిన పాపకర్మనుంచి విముక్తి పొందెను.
23.      కోటి తీర్దాలు కలసిన నీరు బ్రాహ్మణాశీర్వాదంతో తలపై చల్లించుకొని పరమ పవితృలం మరియు 
           పునీతులం అవుతాము.

తీర్ధాలలో స్నానానంతరం భక్తి ప్రపుత్తులతో శ్రీరామలింగేశ్వరుని దర్శనమే ఒక విశేషం.

త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుని సంహరించిన తరువాత సపరివారంతో పుష్పక విమానంలో గంధమాదన పర్వతంపైకి వచ్చి చేరెను. అక్కడ మునులు పులస్త్య బ్రహ్మ కుమారుడైన రావణ వధతో కలిగిన బ్రహ్మహత్యా పాప విమోచనకొరకు శివలింగ ప్రతిష్ఠ చేయమనగా శ్రీరాముడు ఆంజనేయుని శివలింగం తీసుకురమ్మని కైలాసగిరి పంపెను. నిర్ణయించిన శుభతరుణంలో రాలేక పోవడంతో శుభసమయం మించిన అనర్ధమని ఋషుల ఆదేశంతో సీతాదేవి ఇసుకతో శివలింగం చేయగా శ్రీరాముడు దానినే ప్రతిష్ఠించెను. శివలింగంతో వచ్చి చేరిన హనుమ విచారించి శ్రీరాముని ఆనతి మేర ప్రతిష్ఠించిన శివలింగం తీయడానికి ఎంత ప్రయత్నించినా అది ఇసుమంతైనా కదలక పోవటం చూసిన హనుమ శాస్త్రోక్తంగా జరిపిన పని ప్రపంచంలో శక్తి విఘ్నపరచలేదు అని గ్రహించెను. హనుమని ఓదార్చిన రాముడు మరల లింగ ప్రతిష్ఠ చేసెను. శ్రీరామునిచే ప్రతిష్ఠింపబడిన లింగం రామలింగేశ్వరుని గాను హనుమ తెచ్చిన లింగం హనుమదేశ్వరునిగాను నేటి కీ పూజలందుకొంటున్నాయి. ఆలయం వెయ్యి అడుగుల పొడవు, 650 అడుగుల ఎత్తు కలిగి అద్భుత శిల్ప కళలతో 1200 స్తంభాల ప్రదక్షిణమండపంతో భక్తులను ఆకట్టుకొంటున్నది.

సంపూర్ణ కాశీయాత్రలో ముఖ్య విభాగం ధనుష్కోడి వద్ద జరిపే పూజావిధానం. సముద్ర స్నానంతరము అచట నీటిలోపల నుంచి దోసిలిలో పట్టితెచ్చిన ఇసుకతో మూడు సైకత లింగాలను బిందుమాధవుడు, వేణుమాధవుడు, సేతుమాధవుడు అను రూపాలతో ప్రతిష్ఠించి శాస్త్రోక్తముగా పూజలు జరిపి తదనంతరము 33 పర్యాయములు సముద్ర స్నానమాచరించి బిందుమాధవ లింగాన్ని దక్షిణ తాంబూలములతో పూజ జరిపించి బ్రాహ్మణోత్తమునికి దానముగా అర్పించవలెను. సేతుమాధవ లింగాన్ని సముద్రజలాల్లో కలిపి తిరిగి స్నానమాచరించాలి. వేణుమాధవ లింగాన్ని తగు రీతిలో భద్రపరచవలెను. తరువాత హిరణ్యపిండ పూజ చేసి, పితృదేవతలను పూజించి, వారిని తృప్తి పరచి బ్రాహ్మలకు శక్తి కొలది దక్షిణ తాంబూలాదులు మరియు నూతన వస్త్రములు సమర్పించిన తరువాత మడితో చేసిన భోజనానంతరము ఈ కార్యక్రమము సంపూర్ణము అవుతుంది.

1.            పాంబన్ బ్రిడ్గి:- వంతెన బ్రిటిష్ వారు 1870లో పారంభించి 1914 ఫిబ్రవరి 24 పూర్తి చేసారు. వారి ముఖ్యోద్దేశం భారత్ శ్రీలంకతో వ్యాపారాభివృద్ధి. ఇది భారతదేశంలో సముద్రంపై నిర్మించిన మొదటి వంతెనగా రూపుదిద్దుకొంది. సముద్రానికి ఇరువైపుల మధ్య రైలులో ప్రయాణం అత్యద్భుతం భారత దేశంలో రెండవ పొడవైన వంతెన షిప్స్ వచ్చినపుడు గేట్స్ తెరవబడటం అవి మరల ఆవలి తీరం చేరి పోగానే మరల వాటంతట అవే మూసుకుపోవడం ఆటోమేటిక్గా జరిగే ప్రకియ. ప్రయాణీకులు కమనీయమైన సూర్యోదయ వీక్షణాన్ని చూడటానికి మరియు అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని చూసి పడే అంతర్లీన ఆనందానికి వెల కట్టడానికి ఎన్నటికీ, ఎప్పటికీ, ఎవరికీ సాధ్యం కాదు.

2.            రామతీర్ధం:- శ్రీరాముడు సముద్ర మధ్యలో బాణం వేసి జలోధ్భవం చేయటం సీతాదేవి దాహం తీర్చటం జరిగినది. చుట్టూ సముద్రం ఉన్నా బావిలో నీరు మాత్రం తీయగా ఉండటమే  అధ్భుత విశేషం.

3.            గంధమాదనపర్వతం:- శ్రీరాముడు మొదటిసారిగా శరణార్ధుడై వచ్చిన విభీషణుని కలుసుకొన్న ప్రదేశం. ఇచటనే సముద్ర జలాలతో ఆతనిని లంకారాజ్యానికి రాజుగా, అభిషిక్తునిగా చేయడం శ్రీరామునికి విజయసంకేతంగా చరిత్రలో నిలిచిన సంఘటన.

4.            ధనుష్కోడి అంటే 'రామబాణం' అని అర్ధం. ఇది దక్షిణ భారతదేశంలో చివరిభాగం. ఇచట సముద్రం ధనస్సు ఆకారంలో  ఉండటం శ్రీరాముడు సముద్రంపై వారధి నిర్మాణానికి మొదటి బాణం వేసిన స్థలం. ఇచ్చట నుంచి శ్రీలంక 19 కి.మీ దూరంలో ఉన్నది.

5.            నవపాషాణాలు:- త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన నవగ్రహాలు అనుక్షణం సముద్ర జలాలతో అభిషేకింపబడటం ఒక విశేషమైతే చుట్టూ వున్న పరిసర అందాలను మాటలతో వర్ణించలేము. ఇవి రామేశ్వరానికి 70 కి.మీ దూరంలో దేవీపట్టణం వద్ద ప్రతిష్ఠాపితమై నేటికీ పూజలందుకుంటున్నాయి.

6.       పంచముఖ ఆంజనేయుడు:- చాలా శక్తి గల మూర్తి. మహిమోన్నతుడు.

7.       సాక్షి హనుమ:- రామేశ్వరం వచ్చిన వారు తమకి సాక్ష్యంగా సాక్షి హనుమని చూసి నమస్సుమాంజలులు అర్పించటమే అధ్భుతం.

రామేశ్వరము నుంచి అతి జాగరూకతతో ప్రయాగ తెచ్చిన వేణుమాధవ సైకత లింగానికి శాస్త్రోక్త విధానాలతో పూజలు జరిపి తదనంతరం పవిత్ర త్రివేణిసంగమము వద్ద దంపతులు ఒకరి చేయి ఒకరు పట్టుకొని మూడుమునకలు వేసి సరిగంగ స్నానమాచరించటము ఒక ఆనంద అనుభూతి. తరువాత సైకత లింగాన్ని గంగానదిలో కలపడంతో కొంతవరకు యాత్ర సఫలమైనట్టే. గంగ నీరు రెండు శుద్ధమైన పాత్రలలో నింపి తీసుకొని రావటం ఇంకొక ప్రక్రియ.

"ప్ర" అనగా "గొప్ప" "యాగ" అనగా "యాగము" అతి గొప్ప యాగములు చేసిన ప్రదేశం కావున ప్రయాగ అను పేరు వచ్చినది. జీవ కోటికి ప్రత్యక్షసాక్షి అయిన సూర్యభగవానుడు పూజలు జరిపిన క్షేత్రం కావున "భాస్కర క్షేత్రం" అయినది. గంగ: ఇడా నాడి, యమున: పింగళనాడి, సరస్వతి: సుషమ్నానాడీ అని భావించి ఎందరో మహర్షులు, యోగులు తపమాచరించిన పవిత్ర ప్రదేశం. మూడునదుల సంగమమే భూదేవి వడిగా అభివర్ణించడమైనది. గంగా యమునా తరంగాలనుంచి వీచే చల్లని గాలులు నిరంతరం వేదఘోషతో పునీతమై అనంతకోటి భక్తుల పాపాలను ప్రక్షాళనము చేయటమే కాక ఇహలోకంలో సుఖాలు అనుభవించి దేహాంతమున ముక్తి పొందడానికి ఆలవాలమే ప్రయాగ క్షేత్రం.
చూడవలసిన  ప్రదేశాలు:-
మాధవేశ్వరి (అలూపాదేవి):- అష్టాదశ శక్తి పీఠాలలో మహిమాన్వితమైన మాధవేశ్వరి నెలకొన్న ప్రదేశం. సతీదేవి ఉంగరం వేలు పడిన ప్రదేశంగా వినుతికెక్కినది. "ప్రయాగే మాధవేశ్వరీ" సర్వ శక్తిమయమైన దేవికి నమస్సుమాంజలులు.

లలితాదేవి:- అన్ని శక్తులకు మూలశక్తి, కరుణామయి, అభయ రూపిణికి ఇవే శతకోటి వందనములు.
కల్యాణి దేవి:- "కల్యాణి జగతీ కందా" అని కల్యాణ రూపిణిగా లలితా సహస్ర నామాల్లో స్తుతించడమే ఒక విశేషం. సమస్త జగతికి శుభలక్షణాలు ప్రసాదించే కల్యాణి దేవికివే  నమస్కృతులు.

శయనాంజనేయ:- పురాణ ఇతిహాస కధనం ప్రకారం లంకాదహనం తరువాత ఆంజనేయ స్వామి ఇక్కడ శయనించాడని ఆయన రూపం శయనరూపంలో వీక్షిస్తాము. బ్రిటిష్ వారికాలంలో విగ్రహాన్ని కదిలించడానికి అనేక ప్రయత్నాలు చేసినా  వారికి సాధ్యం కాలేదు. అది భూమి లోపలికి దిగిపోసాగినది. పైకి తేవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. తరువాత కాలంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ప్రయత్నించి విఫలం చెందటం స్వామి మహిమకు తార్కాణం అంటారు స్థానికులు. ఇటువంటి మహిమలతో జన్మించిన మహాత్ములకు, భారతదేశ చరిత్రకి జోహార్లు తెలుపవలసినదే.

గంగాపుత్ర భీష్మ:- కురుక్షేత్రయుద్ధంలో తుదిశ్వాసతో స్వచ్చంద మరణశక్తి గల భీష్మాచార్యులు తను మరణించడానికి ఉత్తరాయణ పుణ్యకాలానికై ఎదురుచూస్తూ శయనించి ఉన్న చాల పెద్ద నమూనా గంగా నదీ తీరంలో ప్రతిష్ఠించారు. అత్యంత శక్తిమంతుడైన వీరునికి వందనాలు.

వట వృక్షం:- ఇది నాలుగు యుగాలకి సంకేతంగా నిలచింది.
1            కృతయుగంలో ప్రపంచం అంతా జలమయమైనప్పుడు వటపత్ర సాయిగా వట పత్రంపైన శయనించిన
              బాలుని 
కధతో సృష్ఠి మొదలు అవుతుంది.
2.            త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా లక్ష్మణసమేతుడై విశ్రాంతి కొరకు నిలచిన స్థలం.
3.            ద్వాపరయుగమున పాండవులు ద్రౌపదీ సమేతంగా విడిది చేసిన నేల.
4.            కలియుగమున కలి భగవానుడు తన శ్వేత అశ్వంతో విశ్రాంతి తీసుకొనే స్థలం.

ఇంకా అచట గుహలో సప్తఋషులు, సీతాదేవి దానం చేసిన గుప్తభండారం, శని పరమాత్ముడు,అనేక శివలింగాలు ప్రతిష్ఠాపితమై  అడుగడుగునా వింతలతో, మహిమలతో అలరారుతున్నవి.

ప్రయాగ సంగమం వద్ద  మడితో హిరణ్యపిండ పూజ పితృదేవతలకు చేసి వారిని అన్నివిధాల తృప్తి కలిగించి బ్రాహ్మణులకు శక్తికొలది దక్షిణతాంబూలాలతో మరియు నూతన వస్త్రాలతో సత్కరించి అనంతరం వారి ఆశీర్వాదములు స్వీకరించి భోజన కార్యక్రమాలతో సమాప్తి చేయడం అత్యంత పుణ్యం లభించటమే కాక యాత్ర చాలావరకు సఫలం అవుతుంది.



విశ్వేశ్వర లింగ ఆవిర్భావం
ప్రళయ కాలంలో ప్రకృతి అంతా జలమయమైనపుడు సృష్ఠి కార్యార్ధం పరమ శివుడు కాశీ నగరాన్ని తన త్రిశూలం పైన నిలపగా విష్ణువు చాలా సంవత్సరాలు తపస్సు చేయగా అలసిపోయిన ఆతని శరీరం నుంచి అసంఖ్యాకమైన జలధారలు ప్రవహించి విశాలమైన ఆకాశంలో వ్యాపించాయి. విచిత్ర దృశ్యాన్ని చూసిన శివుడు ఆశ్చర్యంతో శిరస్సు కంపింపచేయగా అతని కుడి చెవి ఆభరణం ఆ జలంలో జారిపడింది. ప్రదేశమే మణికర్ణికా తీర్ధమైనది. మహత్తరమైన జలరాశిలో కాశీ పట్టణం మునిగి పోవడమైనది. అప్పుడు మహాశివుడు తన త్రిశూలముపై నగరాన్ని నిలబెట్టడం జరిగినది. నేటికి కొద్దిగా నీటిలో మునిగి వంగిన భవంతులు మనం మణికార్ణికా ఘాట్ వద్ద చూడవచ్చును. మహా విష్ణువు తన భార్య అయిన ప్రకృతితో అక్కడ నిదురించగా ఆతని నాభి నుండి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించెను. ఆయన శివాజ్ఞను పొంది బ్రహ్మాండము సృష్ఠించడము జరిగినది. ఆ సందర్భంలో అణువు కంటే చిన్న బ్రహ్మాండము కంటే పెద్ద అయిన పరమాత్మస్వరూపుడగు పరమశివుని ఎన్నో విధాల స్తుతించగా ఆతను సంతుష్ఠుడై బ్రహ్మ, విష్ణు ప్రార్ధనలను మన్నించి విశ్వేశ్వర జ్యోతిర్లింగంగా వారణాశిలో వెలసెను.




కాశీ విశ్వేశ్వరుని సన్నిధికి గంగ నీరు తీసుకొని వచ్చి విధి విధానాలతో శాస్త్రోక్తంగా గంగాభిషేక పూజ నిర్వర్తించడం ద్వార యాత్ర సఫలమౌతుంది.






అన్నపూర్ణేశ్వరి:- ఈమె శివుని అర్ధాంగి. అతనికి ఆతని జీవితం కన్నా ముఖ్యమైనది. ఈమెను ఆరాదించిన వారికి అన్నానికి లోటు ఉండదు. ఈమె తన భక్తులకు ప్రసాదించే దీవెనలు ధన ధాన్యాదులు, మోక్షం, ఆధ్యాత్మిక సంపదలు, అనంతకోటి శుభాలు. దేవిని "కాశీ దేవత" "కాశీ వెలుగు" మరియు "కాశీ నగరానికే" మహారాణిగా అభివర్ణిస్తారు. దేవిని "అన్నపూర్ణే-సదాపూర్ణే-శంకర ప్రాణవల్లభే-జ్ఞాన వైరాగ్య సిధ్యర్ధం-బిక్షాందేహి కృపావలంబనకరీ-మాతా అన్నపూర్నేశ్వరీ" అని భిక్ష కోసం, జ్ఞాన భిక్ష కోసం ప్రార్ధిస్తారు. "మాతాచ పార్వతీ దేవి పితాదేవో మహేశ్వర" అని జగత్తుకు మూలకారకులైన ఆది దంపతులుగా, తల్లి తండ్రులుగా అభివర్ణించ బడేవారు ఎప్పటికీ శివపార్వతులే అన్నది సత్యమైన స్థానిక, ధార్మిక జన ఉవాచ.

విశాలాక్షి:- అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన దేవి. కాశీ క్షేత్రమునకు మిక్కిలి ఇష్టములు కూర్చునది. తన వెనుక గంగయందు విశాల తీర్ధమును ఏర్పాటు చేసుకొన్నది. ఈమె వెనుక భాగం స్వయంభు. ఇచ్టట సతీదేవి కనులు పడినవి కావున, "విశాలాక్షి" అను నామముతో అభివర్ణించబడినది. ఈమెను పూజించినవారు సకల సౌభాగ్యములతో లక్ష్మీసంపన్నులుగా విరాజిల్లుతారు. స్త్రీలు పూజించిన జన్మలోను వైధవ్యం కలుగదు.




కాశీలో వెలసిన మాత అన్నపూర్ణేశ్వరి మరియు అష్టాదశ శక్తి పీఠాధిపతురాలైన విశాలాక్షికి వారి వారి సన్నిధిలో కుంకుమార్చన చేసి నూతన వస్త్రములు సమర్పించి సకల సౌభాగ్యములు కలుగ చేయమని చేసే ప్రార్ధనలతో శాస్త్రోక్తంగా జరిపే పూజావిధానాలతో అనంతమైన భక్తి భావాలు వెల్లి విరుస్తాయి.

త్రివేణి సంగమమునుంచి తెచ్చిన గంగాజలం రామేశ్వరంలో వెలసిన శ్రీరామలింగేశ్వరునికి శాస్త్రోక్త పూజావిధానాలతో గంగాభిషేకం చేయడం, తదనంతరం అచట వెలసిన మాత పార్వతీదేవి శుభదర్శనంతో ఆమెకు శతకోటి నమస్సుమాంజలులు  అర్పించిన అనంతరం ఎనలేని పుణ్యసంపదలు మన స్వంతం అవుతాయి అనటంలో సందేహం ఎంతమాత్రం లేదు.

విధంగా ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాద బలం పొందిన తదనంతరం "సంపూర్ణ కాశీ యాత్ర" పరిసమాప్తం అవుతుంది.

1 comment:

  1. చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఇది చదివినా కాశి యాత్ర ఫలితం లభిస్తుంది.

    ReplyDelete