Sunday, 10 September 2017

భూదేవో రక్షతి రక్షిత:

సూర్యచండ ప్రతాపంతో వేడిగాడ్పులతో నిండిన భూమిపైన వాతావరణం ఋతుపరివర్తన ద్వార మార్పు చెంది వర్షాకాల ఆగమనాన్ని చల్లదనాన్ని స్వాగతిస్తుంది. సంతోషంతో రైతులు తమతమ పొలాలు చదును చేసుకొని విత్తనాలు వేసి వానలరాకకై ఎదురుచూసే కాలమది. ఆప్పుడు కురిసిన స్వాతివానతో ఒక్కసారిగా ఏరులు-నదులు, వాగులు-వంకలు సెలయేర్లు-చెరువులు పుష్కలంగా నీటితో దర్శనమిస్తాయి అన్నది నాటి మాట. స్వచ్చమైన వనరుల్లోకి మురుగునీరు చేరుతూ కలుషితం చేస్తున్నది అన్నది నేటి మాట. ఏది ఏమైనా ఎక్కడ విన్న, ఎక్కడ చూసినా నీటి నిల్వలు మురుగునీటితొ పేరుకుపోయి అనేక హానికరమైన బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు, దోమలు వృద్ధి చెంది నీటిని నిరుపయోగం చేస్తున్నాయి. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే సమస్య కనిపిస్తుంది. నేడే కాదు నాటి కాలంలో కూడా ఆషాఢమాసం వస్తుంది అంటే ముందు జాగ్రత్తలు ఎన్నో తీసుకునేవారు. విషజ్వరాలు ప్రబలుతాయి అనే భయంతో భోజనవిషయాల్లోను, నీటిని మరగించి త్రాగటం వగైరా పనులు ఎంతో నియమబద్ధంగా చేసేవారు. దాన్నే ఋతుప్రభావం అనేవారు. ఫరిసరాలు శుద్ధి చేయటమంటే మురుగునీటిని నదుల్లోకి, చెరువుల్లోకి వదిలెయ్యటం కాదు. ముందుగా మనం విషయంలోను తగిన జాగరూకత వహించకపోవటమే సమస్యలు జటిలమవడానికి గల కారణము. విషయాల్లో మనం చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం లాగ అవుతున్నది. సముద్రం తనలోనికి ఎంత నీరైన ఇముడ్చుకునే శక్తి ఉన్నదని అది ఒక అంతులేని అగాధం అని తెలిసి కూడా నీటిని కలుషితం చేస్తున్నాము. దీనివల్ల సముద్రంలో నివసించే అనేక జీవులు తమ వాసాన్ని కోల్పోతున్నాయి. విగతజీవులుగా మారిపొతున్నాయి. కాబట్టి జలరక్షణ, వనరక్షణ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయనేది నిజం.
ముందుగా పల్లెలు చూద్దాం. ఇక్కడ మురుగునీరు నిల్వలు కుంటల్లోనో, లేక చెరువుల్లోనో పూడికలతో ఉంటుంది.
వాటిలోని నిల్వనీటిని కాలువరూపంలో త్రవ్వితే నీరు ప్రవహిస్తుంది. కొన్ని సూక్ష్మక్రిములు గాలివలన, సూర్యరశ్మి తగలటం వలన నాశనమవుతాయి. కొంతనీరు భూమిలోనికి ఇంకిపోతుంది. కొంతవరకు నీటిలోని కాలుష్యాలు వ్యర్ధాలు నాశనమవుతాయి. ఆందుకే మన పెద్దలుపారే నీటిలో దోషం ఉండదుఅంటారు. ఫ్రతి గ్రామసరిహద్దుల్లో చెట్లు పెరిగే అవకాశం మనమే కల్పించి నీటిని అందేలా చేస్తే అవి ఏపుగా పెరుగుతాయి. ఈ నీటి శుద్ధికి రసాయనాలు సాధ్యమైనంత తక్కువ వాడటం మంచిది. నీరు భూమి అడుగుపొరల్లో చేరటం వలన దానిలోని కాలుష్యాలు కొంతవరకు అరికట్టబడతాయి. కాలువల్లోని పూడికని మాత్రం ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇది చాలా క్రమబద్ధంగా జరగాలి. మొక్కలు నాటడం ఎంత శ్రద్ధగా చేస్తున్నామో వాటిని రక్షించడం ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించాలి. అప్పుడే జలరక్షణ, వనరక్షణ జరుగుతుంది. నీటిలో నిల్వయైన కాలుష్యం దూరంగా కాలువ ద్వార ప్రవహించడం వలన కొంతవరకు నిర్వీర్యమవుతుంది. క్షీణపడిన మురికినీరు ఎప్పటికీ హానికరం కాదు. ప్రస్తుతకాలంలో కాలువకి ఇరుప్రక్కల పూలమొక్కల్ని పెంచితే కొంతవరకు అందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఈశాన్యరాష్ట్రాల్లో ప్రతి ఇంటి వెనక పోక్రిలని (చెరువుల్లాంటివి) త్రవ్వుకుంటారు. వీటిలో వర్షం నీరు నిలువచేసుకుంటారు. నీటిని శుద్ధి చేసుకోవటానికి తామరపుష్పాలు వానిలో పెంచుతారు. ఈ నీటిని గృహోపకరణ పనులకు ఉపయోగిస్తారు. వీటిలో పెరిగే కమలపుష్పాలు అందంగా కనులవిందు చేయటమేకాక వాటి ఆకులు, పువ్వులు, కాడలు, విత్తనాలు వివిధ వంటకాల్లో వాడతారు. ఆరోగ్యరీత్యా చాల మంచిది అన్నది వారి నమ్మకం. మరి నమ్మకం మనకెందుకు వర్తించదు? ఇది పురాతనపద్ధతి అయినా నీటి స్వచ్చత అనే నిజం నిగూఢమై వుంది.
స్వచ్చత గురించి ఇంత విపులీకరిస్తున్న కొందరు తమ అశ్రద్ధతో కలుషితమైన నీరు ఉపయోగించి అస్వస్థతతో పాటు మరణిస్తున్నారు. దానికి ఓదార్పులు, మూల్యాలు చెల్లించుకునే డిమాండ్లు కూడా ఒక ప్రక్క పెరిగిపోతున్నై. దీనికంతకు అపరిశుభ్రతే కారణం. కొంచెం శ్రద్ధ వహిస్తే ఎవరో వచ్చి కాదు ప్రజలే తమని తాము రక్షించుకోగలరు. ఫ్రతి చిన్న సమస్యకి ప్రభుత్వ సానుభూతి కోసం వెంపరలాడనవసరం లేదు. వ్యాధులు వచ్చాక నివారణ కోసం అలోచించే కన్నా వ్యాధి ప్రబలకుండా ముందే శ్రద్ధ వహించడం మంచిది కదా అనిపిస్తుంది.

ఇక పట్టణాలు అభివృద్ధి చెందిన నగరాల్లో అతి పరిశుభ్రత కొన్ని భాగాల్లో అయితే అతి కాలుష్య వాతావరణం ఇంకొన్ని విభాగాల్లో. పని అయిన అది మంచైనా చెడైనా అవధులు దాటితే నిరుపయోగమే అవుతుంది. భవంతుల ప్రక్కనే మురికివాడలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడ సరియైన అవగాహన లేక ముందుచూపు లేక కుక్కగొడుగుల్లా నిర్మిస్తున్న భవంతులు గృహనిర్మాణాలు (అభివృద్ధికి చిహ్నం అనుకునేవారికి) ఒక ప్రక్క అడ్డంకులైతే వేరొకప్రక్క వ్యర్ధనీరు పారడానికి సులభతరైమైన మార్గం లేకపోవటం కారణమవుతోంది. దీనివలన ఎక్కడ నీరు అక్కడే వుండిపోవటం సరైన అవగాహన లేని డ్రైనేజీ పద్ధతితో కొంచెం వర్షం పడినా అది వరదలా ముంచెత్తుతోంది. 'నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు అన్న సామెత మనం అవగాహన చేసుకుని నీరునెప్పుడూ పల్లంవైపు మళ్ళించాలి. కలుషిత నీరు సమీపాన ఉన్న చెరువుల్లోకి, నదుల్లోకి మళ్ళిస్తున్నారు. ఇది దారుణం.
అప్పిచ్చువాడు వైద్యుడు; ఎప్పుడు ఎడతెగక పారు ఏరున్; ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ:
పైన ఉదహరించిన నాలుగు ప్రతీ పల్లెకి, నగరానికి అవసరము. ఎక్కడో ఒకటి రెండు నగరాలు అభివృద్ధి చెందినా ప్రస్తుతం చాలా నగరాల్లో వరద ఉధృతి, మురికి నీటివల్ల వచ్చే రోగాలు అధికంగా ప్రజ్వరిల్లుతున్నాయి. దీనికి ముఖ్యకారణం నీటిపారుదలకు తగిన అవకాశం లేకపొవడమే. అవకతవక నిర్మాణాలు కూడా కొంతవరకు కారణం అవుతున్నయి. మనం పల్లెలోలాగా ఇక్కద మట్టి కాలువలు నిర్మించడం సాధ్యం కాదు. ఎందుకంటే చాలావరకు కరెంటు స్తంభాలు వుంటాయి. అందుకని పారే నీటిని సిమెంట్ లేదా ప్లాస్టిక్ పైపుల ద్వారా దూరతీరాలకు చేర్చవచ్చు. కానీ నీటిని ఎక్కడ విడుస్తారు? ఇదీ సమస్యే. మనదేశంలో భూగర్భాల ద్వారా మురికి నీటినిగాని, త్రాగునీటినిగాని, పంపించే పద్ధతి 25,000 సం. క్రితం నుంచే ఉంది. ఇది సింధునాగరికత అన్న పేరుతో ప్రసిద్ధి గాంచింది. నాగరికులు కాలంలో వున్నారనడానికి తార్కాణమిది. రోడ్డుకిరువైపుల పెద్ద పెద్ద భవంతులు నిర్మించి సువిశాలమైన దారులు ఏర్పరచారని చరిత్ర చెబుతోంది. కాబట్టి భూమి క్రింద నుంచి పైపుల ద్వారా నీటిపారుదల చెయ్యవచ్చు. దూరంగా వదిలిన నీటిని 'వాటర్ రీసైక్లింగ్' అను విధానంతో శుభ్రపరచి తిరిగి అదే నీటిని రోజువారీ వాడకానికి ప్రజలకు అందేలా చెయ్యలి. ఇది ఉద్యానవనాల పెంపుదలకి, గృహోపకరణ పనులకి ఉపయోగించవచ్చు. మనకు నీటిఎద్దడి తగ్గుతుంది. నీరు నిల్వలు వుండకపోవడం వలన దానిపై వాలే దోమలు, ఈగలు, సూక్ష్మజీవులు పెరగవు. కొంతవరకు భయంకర రోగాలను అరికట్టవచ్చు. ఎందరో జనులు మృత్యువాత పడకుండా నివారించవచ్చు. అంతగా అభివృద్ధి చెందని ప్రాంతాల్లో నీటిని క్లోరినేషన్ అనే పద్ధతిలో శుద్ధి చేసి ట్యాంకుల ద్వారా ప్రజలకి అందచేయవచ్చు. లేదా రోడ్డుకిరువైపుల పెంచిన వృక్షసముదాయానికి తరలించవచ్చు. అరటిచెట్లు పెంచడానికి అధికనీరు అవసరం అవుతోంది. వాటికి ఉపయోగించితే చెట్టు యొక్క ఆకులు, కాయలు, పండ్లు, మాను ఉపయోగకరమే. అధిక రాబడికూడా ఉంటుందితామరపూవులను బురదనీటిలో పెంచితే అవి నీటిని కొంతవరకు శుద్ధిచేయగలవు. సువేజీ క్లీనింగ్ (మెషిన్సు ద్వారా తీయటం) వ్యర్ధాలను దూరంగా నిర్మానుష్య ప్రదేశాల్లోకి చేర్చితే కొంతకాలానికి అది ఎరువుగా మారుతుంది. ఒక్క త్రాగేనీరుని (శుద్ధమైన చెరువుల ద్వారాగాని, బావులద్వారాగాని, నదులద్వారాగాని) మాత్రమే వాడుకుంటే మనం ఎంతో నీరు సదుపయోగం చేసినవారమవుతాము.
తరువాత మనం ముఖ్యంగా నీటిలోకి విడిచే వ్యర్ధాల్లో ప్లాస్టిక్ ముఖ్యమైన హానికర వ్యర్ధంగా భావించబడుతోంది. వ్యర్ధాలు సీసాలు, కవర్లు ఎన్నో మరెన్నో విధాలుగా రోజురోజుకీ కొండలా పేరుకుపోతున్నాయి. నవీనయుగంలో నీటివాడకం మితిమీరిపోయింది. వీటిని అరికట్టడానికి సులభమైన ఉపాయాలే వున్నయి. సాధ్యమైనంతవరకు ప్రయాణాల్లో ఎవరికివారు త్రాగే నీటిని తమకు అనుకూలంగా వెంట తీసుకు వెళ్ళే పద్ధతి మంచిది. రైల్వేస్టేషన్‌, బస్ స్టాండుల వద్ద ట్యాంక్‌లో నీరు క్లోరినైజ్ చేసి వాటిని కూలింగ్ ఫిల్టర్లు ద్వారా మంచి శుద్ధమైన చల్లని నీరు అందిస్తే వ్యర్ధాల్ని అరికట్టవచ్చు. దీనికి మినిమం చార్జీగా కొంతడబ్బు వసూలు చేస్తే వచ్చే ఆదాయంతో క్లోరినేషన్, ఫిల్టెరషన్ అనేవి జరుగుతాయి. ఆదాయంతోపాటు వ్యర్ధాలు కూడా అరికట్టబడతాయి. ఇంక ఇంటింటికీ వచ్చే పాలసరఫరా వారు కేన్లలో లేదా గాజుసీసాల ద్వారా తగిన కొలతతో అందిస్తే ఎంతో ప్లాస్టిక్ వ్యర్ధం అరికట్టబడుతుంది. నేడు కొనే పప్పుదినుసులు వగైరాలు ప్లాస్టిక్ కవర్ల బదులుగా కాగితంతో చేసిన సంచీలలో సరఫరా చేస్తే తొంభై శాతం ప్లాస్టిక్ వాడకం అరికట్టబడుతుంది. పేపరు కవర్లు తయారుచేసినవారికి కుటీరపరిశ్రమ అవుతుంది. అదే సమయంలో మనం వాడి పారేసిన పేపర్లు, మ్యాగజైన్లు ఉపయోగం అవుతాయి. నూనె, నెయ్యి, వగైరాలవంటివి గాజుసీసాల్లో పేక్ చేయవచ్చు. ఇవి తిరిగి ఉపయోగించడానికి అనుకూలం. ప్లాస్టిక్ అనేది ఎంతో అవసరమైతే తప్ప సామాన్యుడికి అందుబాటులో వుండకూడదు. ముఖ్యంగా నగరాల్లో గార్బేజీ కవర్లు ప్రతీరోజు గుట్టలు గుట్టలుగా నిండిపొతున్నాయి. వీటిని అరికట్టాలంటే ప్రతీ కూడలిలో రెండు డస్టుబిన్లు ఏర్పాటు చేయాలి. (ఆర్గానిక్) ఎరువు తయారీకి సంబంధించినవి ఒకదానిలో (డైమెటీరియల్) వేరొకదానిలో వాడాలి అన్న అవగాహన ప్రజల్లో కల్పిస్తే కొంతవరకు ప్లాస్టిక్ వ్యర్ధాలు అదుపులోకి వస్తాయి. లేకుంటే వ్యర్ధాల్ని నదుల్లోకి చెరువుల్లోకి పచ్చని పరిసరాల్లోకి వదిలేస్తున్నారు. కొన్నిచోట్ల పశువులు వ్యర్ధాలు తిని ప్రాణాపాయం తెచ్చుకున్న సంధర్భాలు ఉనాయి. ఇది మనం చేతులారా చేసుకుంటున్నాము. ప్లాస్టిక్ కవర్లలో కట్టే టిఫిన్ కన్నా  అరిటాకుల్లో, విస్తరాకుల్లో, బాదామి ఆకుల్లో, తామరాకుల్లో కడితే ఉపయోగిస్తే మనం తినిపారేసినా తిరిగి ఎరువు క్రింద తయారుచేయవచ్చు. వీటిని తగిన ఆకారాల్లో అందంగా తయారుచేస్తే తినడానికి జనం ఇష్టపడతారు. వీని ద్వారా కూడా కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి అంటాను. మీరేమంటారు?
ఇంకొక అధిక వ్యర్ధాలు మనం పారేసే తిండిపదార్ధాలు. ఇవి ముఖ్యంగా కేటరింగ్ల్లోను, హోటల్సులోనూ, పెండ్లింటి వేడుకల్లోనూ, రైళ్ళలోను అధికం. ప్రతీచోట డస్టుబిన్లు ఉన్న చెత్త మాత్రం వాటి చుట్టూ పేరుకుపోయి ఉంటుంది. వాటి పైవాలిన ఈగలు, దోమలు వాతావరాణాన్ని విషపూరితం చేస్తాయి. అనేక జంతువులు పీక్కుతింటాయి. అడుక్కునే యాచకులు ప్లాస్టిక్ వ్యర్ధాల కోసం, లేదా తిండి కోసం చెత్తనంతా బయటకు లాగుతారు. దానివలన పరిసరాలన్నీ దుర్గంధమయం అవుతాయి. ఇది చాలా అనూహ్యమైన వాతావరణం. కంటికి కనిపించే ప్రత్యక్ష నిజం. దీన్ని అరికట్టడానికి కొన్ని ఎన్.జి.వొ. సంస్థలు ముందుకు వచ్చారు. వారు ఆహారవ్యర్ధాలను శుభ్రతతో ప్యాక్ చేసి పందుల పెంపకదార్లకు సరఫరా చేయడం వలన వీటిని పందులకు అహారంగా వాడతారు. కాలుష్యాన్ని అరికట్టడానికి సంస్థలు చేసే కృషి అభినందనీయం. సంస్థలు పని చేస్తున్నాయి కదా అని మనం తృప్తిపడి సమస్యలు తీరేయని అనుకోకూడదు. వారిని సహకరించడానికి మనవంతు కృషి మనం చెయ్యాలి.
"సాధించిన దానికి సంతృప్తిని పొందీ
అదే విజయమనుకుంటే పొరపాటోయి
ఆగకోయి భారతీయుడా
కదలిసాగవోయి ప్రగతిదారులా అన్నారొక కవి.
కాబట్టి సంస్థలు ఇంకా దేశమంతటా విస్తరించాలి. అప్పుడే కొంత స్వచ్చత దేశంలో చేకూరుతుంది.
ఈనాడు విందు స్టేటస్ సింబల్‌గా ఒకర్ని మించి ఒకరు తమ గొప్పతనాన్ని చాటుకుందికి వందల కొద్దీ తినే పదార్ధాలు తయారుచేస్తున్నారు. కోట్లకొలదీ ధనవ్యయం మాత్రమే కాదు భోజన వ్యయం కూడా అమితంగా చేస్తున్నారు. 'అన్నం పరబహ్మ స్వరూపం' అన్నారు వేదాల్లో. ఇది వ్యర్ధం చెయ్యడానికి మనకు అధికారం లేదు. అయిన అలా చేస్తున్నామంటే క్షమించరాని నేరమే. భగవంతుని ధిక్కరించడమే అవుతుంది. ఇది నేను ఎవరినీ కించపరచటానికి గానీ వారి రంగ రంగ వైభవాన్ని భంగపరచడానికి గానీ వ్రాయటంలేదు. జన్మలో చేసుకున్న పుణ్యమో భగవంతుడు మంచి భోజనం ప్రసాదించాడు అని అతనికి కృతజ్ఞతలు తెలిపి భక్తితో నమస్కరించి తినండి. అది మీకు అంతులేని ఆరోగ్యం ప్రసాదిస్తుంది. మనశరీరానికి ఏది హితవో అదే తినాలి. 'ఆరోగ్యమే మహాభాగ్యము అన్న ఆర్యోక్తి నిజంకదా! పైకి అతిచిన్నగా కనిపించే మార్పులు సలహాలు మనం ఆచరణలో పెడితే భూమి తనంతట తానే స్వచ్చమవుతుంది. భూదేవి మనకు ఇచ్చిన వనరుల్ని, నీటిని, గాలిని, పరిసరాల్ని సర్వజగత్తును కాలుష్యాల నుంచి నిర్మూలన చేసి విశ్వమానవ సౌరభ్యం చేకూర్చిననాడు.

'భూదేవో రక్షతి రక్షిత:' భూమిని మనం రక్షిస్తే భూదేవి తిరిగి మనల్ని కాపాడుతుంది అన్న పదాలు నిజాన్ని ఆపాదిస్తాయి.

No comments:

Post a Comment